Tuesday, August 4, 2020

కోటిలింగాలలో శాసనాలు

 

 

 

కోటిలింగాలలో శాసనాలు:

          కోటిలింగాలలో బౌద్ధస్తూపం శిథిలాలున్నచోట స్తూపానికి పెట్టే శిలాకంచుకానికి(Casing)వాడిన రాతిఫలకాలలో దొరికిన లేబుల్ శాసనాలు 26రింటిలో అర్థవంతమైన సమాచారం లేదని పురావస్తుశాఖ భావించింది. కాని ఠాకూర్ రాజారాం సింగ్ పట్టుదలతో ఆ శాసనాల ఫలకాలమీది రాతలను చూసి రాసుకొని,  తను చదువుకున్న పాఠశాలలోని మిత్రుని కుమారుడు మల్లావఝల నారాయణశర్మకు వాటి పరిష్కార బాధ్యతను అప్పగించాడు. ఐకే శర్మ సాయం కూడా లభించింది, నారాయణశర్మ ఆ శాసనాలను అధ్యయనం చేసి, బ్రాహ్మీలిపి పరిణామాలను పరీక్షించి, తాను వాటికి అర్థకల్పన చేసాడు. అవి బుద్ధుని ఆర్యసత్యాలను పోలివున్నాయని అభిప్రాయపడ్డాడు. లఘుశాసనాలలోని బ్రాహ్మీలిపి మౌర్యుల బ్రాహ్మీలిపితో, భట్టిప్రోలు బ్రాహ్మీతో పోలివుందని ఠాకూర్ రాజారాం సింగ్ అభిప్రాయపడ్డాడు. కొన్ని బ్రాహ్మీ అక్షరాలు పై లిపులకాలం కన్నా ముందరివని అభిప్రాయం కలిగింది. భాషాశాస్త్రవేత్త, సంస్కృత పండితుడు నారాయణశర్మ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. ‘కోటిలింగాల- బ్రాహ్మీలఘుశాసనాలు’ అనే పరిశోధనాపత్రం కరీంనగర్ నుంచి వచ్చిన సాతవాహన కళోత్సవాల సంచిక(2002)లో అచ్చయింది. ఈ పత్రాన్ని ‘కోటిలింగాల- ఏ రిపోర్ట్ ఆన్ ఎక్స్కేవేషన్స్(1979-1983)’లో శాసనాలు(10వ అధ్యాయం)లో ఎన్నెస్ రామచంద్రమూర్తి  పేర్కొన్నారు. ఈ కోటిలింగాల తవ్వకాల నివేదికలో కోటిలింగాలలో, పరిసరాలలో లభించిన శాసనాల గురించి కొంత వివరం లభిస్తున్నది.

          కోటిలింగాలలో దొరికిన కొన్ని లఘుశాసనాలలో ‘గరకస’, ‘ఘరినిధ(గృహిణి)’, ‘పొధమర’ లున్నాయి.

          మొక్కట్రావుపేటలో లభించిన ‘నాగగోపినికాయా’ నామశాసనం వున్నది.

          క్రీ.పూ.1వ శతాబ్దానికి చెందిన బ్రాహ్మీలిపిలో రాయబడిన ఈ నామశాసనంలోని ‘నికాయ’ ఒక మత సంబంధమైన శ్రేణి,  నాగగోప అనే వ్యక్తి ఆధ్వర్యంలోని బౌద్ధ సన్యాసుల సమూహం గురించి తెలుపుతుంది. నికాయకు ఒక రాశి, ఒక కూర్పు, వర్గం, ఒకే విధమైన విధులు నిర్వహించేవారి సంఘమని అర్థాలున్నాయి. బౌద్ధ సుత్త సాహిత్యంలో మజ్జిమ నికాయ, దీఘ నికాయ, అంగుత్త నికాయ, సంయుత్త నికాయ, ఖుద్దక నికాయలున్నాయి. ఈ నామక శాసన సందర్భాన్ని బట్టి బౌద్ధసన్యాసుల సంఘానికి పెద్దవాడు నాగగోప అని అర్థమవుతున్నది.

          కోటిలింగాలలో పెదవాగు ఒడ్డున బౌద్ధస్తూపముంది. కోటిలింగాలకు సమీపంలో పాశిగాం, కంభాలపల్లిలలో స్తూపాల, చైత్యాల శిథిలాలు లభించాయి.

          నాగగోపినికాయ నామశాసనం చెక్కిన రాతిదూలాన్ని చూసినపుడు, అది ఒక శ్రేణి, ఒక సంఘం వున్న స్థానానికి ప్రవేశద్వార పతంగం అనిపిస్తుంది. నిఘంటువులను సంప్రదిస్తే ఇల్లు, కులవృత్తుల సంఘం అని నికాయకు అర్థాలనిస్తున్నాయి.

          మొక్కట్రావుపేటలోనే లభించిన హకుసిరి శాసనంలో

          ‘అహమకా నభ(మ) బాలికాయ మహపురిస దతాయ

          అమచపుతస సివవటుస స ఉపథ యకినియ చదేయ

          చథ బాలికాయ హకుసిరియ ఈ దేయ నాగ(సిరి)య గోపియ’

 3వ పంక్తి చివర ‘నాగ...య గోపియ’ అని వుంది. అందువల్ల ‘నాగగోపినికాయ’ నామశాసనంలోని నాగగోపి ఇతడేనని చెప్పవచ్చు.




Thursday, April 23, 2020

పొట్లపల్లిలో శివాలయం:


 పొట్లపల్లిలో ఒకరు ఇంటిపనుల్లో భాగంగా తవ్వుతుంటే శివాలయంలో లింగం ప్రతిష్టించే పానవట్టం ఒకటి బయటపడ్డట్లు నిన్న వార్త వచ్చింది. హుస్నాబాద్ నుంచి విలేకరి మిత్రుడు ఎల్లయ్య రెండ్రోజుల నుంచి సంప్రదిస్తున్నాడు పొట్లపల్లి చరిత్ర గురించి. ఫేస్బుక్లో అనంతవరం శ్రీనివాస్ వార్త, ఫోటోలు పెడుతున్నాడు.
          ఇపుడు బయటపడ్డ పానవట్టం 5అంచుల గుండ్రని పానవట్టం. ఈ శైలి పానవట్టాలు కళ్యాణీ చాళుక్యులనాటి శివాలయాలలోనే ఎక్కువగా అగుపిస్తాయి. అయితే ఈ పానవట్టాల మీద ప్రతిష్టించే లింగాలు కాకతీయశైలి సమలింగాలు కావు. వీటికి బ్రహ్మ,విష్ణు,రుద్రభాగాలుండవు. ఒక లింగభాగమే వుంటుంది. నర్మదానదిలో దొరికే బాణలింగాలుగా పిలిచే గుండ్రని అండాకారపు రాళ్ళలో ఒకటి లింగంగా ఈ పానవట్టంమీద అమరుస్తారు. ఇపుడు పానవట్టం దొరికింది. అది  ఆలయం నుంచి తీసి బయటపడేసింది కాకపోతే బాణలింగం కూడా అక్కడే దొరకవచ్చు.
          కరీంనగర్ జిల్లా శాసనసంపుటిలో  16వ శాసనం(42వ పేజీ) పొట్లపల్లి శాసనం.ఈ శాసనంలో క్రీ.శ. 1066వ సం.(శక సం.988, చైత్రపౌర్ణిమ) మార్చి 14న, చంద్రగ్రహణం సందర్భంగా అక్కడి పంచమఠాలలోని నకరేశ్వర దేవరకు  తపోధనుడు మల్లప్ప(గురువు)అగ్రహారం కొరకు ద్రవ్యం మొదలైన సమభోగాలకు, త్రిభోగాభ్యంతర సిద్ధిగా, సర్వపరిహారం (అన్ని పన్నుల రద్దు)గా ధారాపూర్వకంగా 5 కొట్టరాడ్ల రాటణాన్ని కళ్యాణీ చాళుక్యచక్రవర్తి త్రైలోక్యమల్ల దేవుని పాలనాకాలంలో అతని మహాసామంతుడు పొట్టపల్లి గోవ(అధికారి) రేగొండ చందయ్య రసర్(రాజు) దానం చేసాడు.
          త్రైలోక్యమల్లదేవుని శాసనాలలో పంచమఠాల ప్రస్తావన వస్తుంది. ఈ పంచమఠాలు కాలాముఖమఠాలు కావచ్చు. పొట్లపల్లి  గురువు మల్లప్పకిచ్చిన అగ్రహారం. ఈ అగ్రహారంలో నీటి వ్యవస్థ కొరకు మహాసామంతుడు రేగొండ చందయ్యరసర్ నీరుతోడే యంత్రం రాటనాన్ని దానం చేసాడు. అగ్రహారానికి పన్నుల బాధలేకుండా చేసాడు.
          పొట్లపల్లి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలంలోని గ్రామం. ఈ గ్రామానికో వాగుంది. దాన్ని రేణుకావాగు అని పిలుస్తారు. ఊరిబయట నాగశిలలున్నాయి. పోషమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మదేవత, పరశురాముడికి గుడులున్నాయి. ఊరిలో మల్లన్న గుడి, సీతారామచంద్రస్వామి గుడి, శివాలయాలున్నాయి. అపుడపుడు గ్రామంలో పునాదుల కోసమో, పనులకోసమో తవ్వినపుడల్లా ఏదో ఒక విగ్రహమో, గుడి స్తంభాలో దొరుకుతుంటాయి.
          పొట్లపల్లి గ్రామానికి దగ్గరలో ఒకగుట్ట వుంది. దీన్ని ఎల్లమ్మగుట్ట అని పిలుస్తారు స్థానికులు. గుట్టపాదంలో  బంతిరాళ్ళ సమాధులు విరివిగా కనిపిస్తాయిక్కడ. వీటిని పరిశీలించినపుడు ఇవి పెదరాతియుగం సమాధులు అని తెలుస్తుంది.

Tuesday, April 9, 2019

యాదగిరిగుట్టలో ఆత్మాహుతిశిల:

యాదగిరిగుట్టలో ఆత్మాహుతిశిల:
యాదగిరిగుట్ట రాయగిరిల మధ్య రాయగిరి చెరువుకు ఉత్తరాన సాయిబాబా నగర్ ప్రాంతంలో రాష్ట్రకూటుల కాలంనాటి శిధిలశివాలయం ఆనవాళ్ళు లభించాయి. వాటికి తూర్పున 7 వీరశిలలు వున్నాయి. అందులో ఒక వీరగల్లు మీద 7,8 శతాబ్దాలనాటి తెలుగులిపిలో శాసనముంది. మహబూబ్నగర్ గొల్లత్తగుళ్ళ వద్ద కనిపించిన వీరగల్లుల మీద వున్న తెలుగులిపే ఇక్కడ అగుపించింది. అక్కడున్న వీరగల్లులు దాదాపు యుద్ధంలో ఒరిగిన వారివే. ఒక్కటి మాత్రం ప్రత్యేకం. ఈ వీరగల్లు రెండంతస్తులు కలిగివుంది. పై అంతస్తులో భక్తుడు అప్సరసల నడుమ కూర్చుని వున్నాడు. కింది అంతస్తులో ధ్యానాసనంలో నమస్కారముద్రలో కూర్చున్న భక్తుని మెడ తెగి తల వేరుగా కనిపిస్తున్నది. అతని పక్కన ఒంచిన (వెదురు)గడ తలమీద జుట్టును తాకుతున్నది. ఈ భక్తుని కోరిక మేరకు ఎవరో ఇతని మెడనరికి తలను వేరు చేసినట్లున్నది. ఇట్లా కోరి శివార్పణంగా తలపండునివ్వడం వీరశైవుల సంప్రదాయం. ఇటువంటి శిలలు పురుషులవి (1.బిర్లామ్యూజియం, హైద్రాబాద్,2. పెద్దపల్లి జిల్లా ఆబాది రామగుండం దగ్గర లింగాపురం, 3.యాదగిరిగుట్ట) దీనితో కలిపి3, స్త్రీలవి 3(జనగామజిల్లా వనపర్తి, యాదాద్రిజిల్లా చొల్లేరు, జనగామ జిల్లా సీతారాంపురం) ఆత్మాహుతి శిలలను తెలంగాణాలో తెలంగాణా జాగృతి చరిత్రబృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, చంటి, కళ్ళెం సంపత్ కుమార్ గౌడ్ గుర్తించారు










.

ఇంద్రపాలనగరంలో ‘శంకరగండరస’ జయధీర జైనబసది:

ఇంద్రపాలనగరంలో ‘శంకరగండరస’ జయధీర జైనబసది:

March 12, 2016న నేను, మా చంటితో కలిసి వలిగొండ, తుమ్మలగూడెం శంకరంగుట్టలలో చరిత్రకొరకు అన్వేషించాం. మాకు శంకరంగుట్ట మీది విశేషాలను చూడడానికి తోడ్పడ్డవారు వనంక్రిష్ణయ్య(భోగారం), వి.లింగయ్య (తుమ్మలగూడెం), బెలిదె రాజయ్య (నాగారం), యాదయ్య (తుమ్మలగూడెం).ఆ పెద్దలకు మా ధన్యవాదాలు.
ఈ గుట్టమీద కళ్యాణీ చాళుక్యులకాలం నాటి దేవాలయం, శాసనం శిథిలస్థితిలో వున్నాయి. పలుమార్లు పునరుద్ధరణలు చేయడం వల్ల దేవాలయం రూపురేఖలు చాలా మారి పోయాయి. జైనగుహాలయాలనే తమ ఇష్ట దైవాలయాలుగా మార్చివేసారు. ఇపుడు గుడివున్నచోటుకు పైకి వెళితే రాతిగుండ్ల మధ్యనుంచి తీసిన దారి జైనబసదికి తీసుకువెళ్తుంది. అక్కడ రెండు ఎత్తైన కొండరాళ్ళ మీద జైనతీర్థంకరుల ఉల్బణశిల్పాలు(Bas relieves) అగుపిస్తాయి.
తేదీలేని తుమ్మలగూడెం శాసనం(నల్లగొండ జిల్లా శాసనాల సంపుటి, వాల్యూం 1, పేజీనం.38 శా.సం.15)లో బిరుదగద్యలలో చెప్పబడిన శంకరగండరస ఎప్పటివాడో చెప్పలేదు. కాని, 2016 జనవరిలో నల్లగొండ జిల్లా ఆమనగల్లులో మాకు లభించిన శంకరగండరస శాసనం అకాలవర్షుని పరిపాలనాకాలం(క్రీ.శ.888)నాటిది. మహామండలేశ్వరుడుగా కొలనుపాక-20,000నాడును పాలిస్తున్న శంకరగండరస పేరన చేర్యాల దగ్గర ఆకునూరులో, వరంగల్ దగ్గర జాఫర్ గడ్ లో, తుమ్మలగూడెం(ఇంద్రపాలనగరం), ఆమనగల్లులో శాసనాలు లభించాయి. ఆమనగల్లులో తప్ప మిగతా శాసనాలలో శంకరగండరస కాలం లేదు. తర్వాత కాలంలో కొలనుపాకలోనే చిన్నా, పెద్దపాలకులుగా వున్న ఇద్దరు శంకరగండరసలున్నా వారి కాలం వేరు. వారి మతం వేరు. మొదటి శంకరగండరస కాలం క్రీ.శ. 888, రాష్ట్రకూటుల ప్రతినిధిగా కొలనుపాకను ఏలినవాడు. అమోఘవర్షుని కాలంలో పానుగనూరు-27000నాడుకు పాలకుడుగా వుండేవాడు. అమోఘవర్షునితో ఘర్షణ పడినా, దగ్గరి బంధువు, రాజకీయ చాతుర్యమున్నవాడు కనుక కొలనుపాకకు తిరిగి ప్రతినిధిగా నియమింపబడ్డాడు. రాష్ట్రకూటులు జైనులే. శంకరగండరస జైనుడే. ఆమనగల్లులో అతనిపేరన వేయబడిన శాసనంలో అక్కడ ‘ఆకులార్బుగుళు’ జైనబసదికి దానాలు చేసినట్టు వుంది. అతనికి వున్న బిరుదులలో ఒకటైన ‘జయధీర’ పేరన తుమ్మలగూడెంలో జయధీర జినాలయం కట్టించినట్టు చెప్పబడింది.
శంకరం గుట్ట మీదున్న ఈ జైనబసదే జయధీర జినాలయం. ఈ జైనబసదిలో రెండువైపుల రెండు నిలువు కొండరాళ్ళపై జైన తీర్థంకరుల బొమ్మలు ఒక వైపున పార్శ్వనాథునితో కూడిన 3తీర్థంకరులు, మరొకవైపు 5గురు తీర్థంకరులు ధ్యానాసనాలు, ధ్యానముద్రలతో వున్నారు. మరొక చోట అసంపూర్ణంగా వున్న శిల్పం కనబడుతున్నది. శంకరంగుట్ట అన్నది కూడా శంకరగండరస పేరుమీదనే వచ్చివుండవచ్చు.
(అయితే ఇదే గుట్టమీద తూర్పువైపున స్తూపాకారంలో ఇటుకల వరుసలు, 3చోట్ల కనిపిస్తున్నాయి. శంకరంగుట్టవెనకవైపు కింద మూసీనది ఒడ్డున బౌద్ధస్తూపం జాడలున్నాయి.)








Monday, July 2, 2018

షితాబుఖాన్ అనబడే చిత్తాపుఖాన్
షితాబుఖాన్ ను చిత్తాపుఖాన్ అని పిలిచేవారు. షితాబుఖాన్ మొదటిపేరు సీతాపతిరాజు. పసులమందలను కాచే బోయకులంలో పుట్టినవాడు.బహమనీ సుల్తాన్ హుమాయూన్ షా సైన్యంలో కాల్బంటుగా పనిచేసాడు. పెద్దస్థాయి సైనికాధికారిగా ఎదిగాడు. షితాబుఖాన్ అనే పేరుతో సొంతజాగీరును ఏర్పరుచుకున్నాడు. షితాబుఖాన్ అనే పేరును హోదాకోసమే వాడుకున్నాడో లేక ముస్లింగా మారాడో తెలియదు.
‘తారిఖ్ ఇ ముహమ్మద్ ఖుతుబ్షాహి’లో షితాబుఖాన్ నిర్భయయోధుడైన ఖమ్మంమెట్టు రాజుగా వర్ణించబడ్డాడు. బ్రిగ్స్ అనే చరిత్రకారుడు ‘హిస్టరీ ఆఫ్ ది రైజ్ ది ముహమ్మడన్ పవర్ ఇన్ ఇండియా’ లో షితాబుఖాన్ ను హిందువైన సీతాపతిగా రాస్తాడు. వరంగల్లులోని 1503నాటి శాసనంలో షితాబుఖాన్ వంశక్రమం వివరించబడ్డది. షితాబుఖాన్ వరంగల్, ఖమ్మం, నల్లగొండల పాలకుడుగా వుండేవాడు.
బహమనీల మీద దండయాత్ర అనంతరం గోల్కొండకు తిరిగివచ్చిన సుల్తాన్ఇబ్రహింకు షితాబుఖాన్ కుతుబ్షా రాజ్యాన్ని ఆక్రమించజూస్తున్నాడని ఫిర్యాదులొచ్చాయి. ప్రతిఘటించకుండానే వరంగల్ సుల్తాన్ స్వాధీనమైంది. హిందూపాలకుల సంఘటనను కూడగట్టుకునే లోపల మళ్ళీ సుల్తాన్ దాడి. ఆ రాజులు షితాబుఖానుకు ఎంత మద్దతిచ్చినా ఫలితం లేకపోయింది.
క్రీ.శ. 1480 నుంచి 1485వరకు షితాబుఖాన్ రాచకొండ గవర్నర్ గా వుండేవాడు. బహమనీరాజ్యంలోని అంతఃకలహాలను తనకనుకూలం చేసుకొన్న షితాబుఖాన్ క్రీ.శ. 1503లో స్వతంత్రపాలకుడయ్యాడు. 1503 నుంచి 1512దాకా రాచకొండ, వరంగల్, ఖమ్మం కోటలనుంచి పాలన సాగించాడు. చెరువులను తవ్వించడం, పాకాల చెరువును బాగుచేయించడం వంటి ప్రజాహిత కార్యాలను చేసాడు.
16*38*12 మీ.ల కొలతలతో ఇండో సారసెనిక్ శైలిలో వరంగల్ కోటకు పడుమట నిర్మించబడ్డది ఖుషమహల్ సౌధం. షితాబుఖాన్ కొలువులోని ప్రధానమంత్రి ఎనుములపల్లి పెద్దనమంత్రి చరిగొండ ధర్మన్న రాసిన ‘‘చిత్రభారతాన్ని’’ అంకితం గొన్నవాడు. ఇందులో షితాబుఖాన్ పరిపాలన గురించి చాలా గొప్పగా వర్ణించబడ్డది.
కులీ కుతుబ్షా షితాబుఖాన్ మీద చాలాసార్లు దండెత్తాడు. ఎన్నిసార్లు యుద్దం చేసినా కొన్నిసార్లు గెలుపు, కొన్నిసార్లు ఓటములతో షితాబుఖాన్ సతమతమయ్యాడు. 1512 తర్వాత కళింగ రాజైన ప్రతాపరుద్రగజపతి సేవలో చేరాడు. కృష్ణదేవరాయలు గజపతులమీద దండెత్తినపుడు రాయల్ని సింహాద్రి వద్ద (విశాఖ జిల్లా) విలుకాండ్రసైన్యంతో నిలువరించాడట. కాని, గెలుపు రాయల వశమైంది. ఆ యుద్ధంలోనే షితాబుఖాన్ మరణించివుంటాడని కొందరు చరిత్రకారుల అభిప్రాయం.
ఈ షితాబుఖాన్ 1503లో శాయంపేటలోని పాంచాలరాయస్వామి దేవాలయాన్ని పునరుద్ధరించాడని శాసనంలో వుంది.
‘చిత్రభారతం’ కవి చరిగొండ ధర్మన్న ఊరు మా చరిగొండః
చరికొండ గ్రామము పాత మహబూబ్ నగరం జిల్లా, కల్వకుర్తి తాలుకా, ఆమనగల్ మండలంలో వుండేది. ఇప్పుడది రంగారెడ్డి జిల్లా, కడ్తాల మండలానికి మార్చబడ్డది. గ్రామానికి ఉత్తరంగా మేడిపల్లి నక్కేర్త, తూర్పున కొలుకులపల్లి, దక్షిణాన నాగిళ్ళ, పడమర ముదివెన్ను గ్రామాలున్నాయి. 
చరికొండలో అడివి దాదాపు 5వేలఎకరాలలో విస్తరించివుండేది. అడవిలో నీటివూటల కాలువలు,వూరి దగ్గర పారే కల్లెడ వాగు, గౌరమ్మ చెరువు చరికొండ నీటివనరులు. ఊరావల గుట్టల్లో నాగప్పచెరువు, పెరుమాండ్ల కుంట, కొత్తచెరువులు అదనపు నీటిసంపదలు. ఊరికి వ్యవసాయాధారాలు.
గ్రామంలో ఉత్తరదిశలో రుక్మిణీ,సత్యభామా సమేత వేణుగోపాలస్వామి దేవాలయముంది. ఈ దేవాలయంలోని స్వామికి ప్రతిసంవత్సరం ఫాల్గుణమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
ఇంకా ఈ గ్రామంలో గ్రామదేవతలు దుర్గమ్మ, పోచమ్మ, కోటమైసమ్మలకు గుడులు వున్నాయి.
గ్రామము చివర పాతకాలంనాటి మసీదు వుంది.
గ్రామానికి ఉత్తరదిశలో ఖిల్లాగుట్ట వుంది. గుట్టమీద కోట ఆనవాళ్ళున్నాయి. గుమ్మటాలు ప్రజలు పిలుచుకునే కట్టడాలు 4మిగిలివున్నాయి. ఈ కోటను రేచెర్ల పద్మనాయకులు కట్టించారని చరిత్ర. రాచకొండను, దేవరకొండను పాలించిన పద్మనాయకులే చరిగొండలో కోటను నిర్మింపజేసారు.
ద్వారము నుంచి కోట లోపలికి ప్రవేశించగానే పెద్దబావి అగుపిస్తుంది. ఆ బాయి వొడ్డున నిలబడి రాయి విసిరితే అవతి వొడ్డుకు పడదని స్థానికులు చెప్పకుంటారు. అంత పెద్ద బాయన్నమాట.
ఒక బండకింద వున్న బావిని ‘కన్నికల బావి’(కన్నెలబాయి?)అని పిలుస్తారు. బండకు కొందరు స్త్రీమూర్తుల శిల్పాలు చెక్కి వున్నాయి.
పెరుమాండ్లకుంట దగ్గర దేవాలయశిథిలాలు కనిపిస్తున్నాయి. అక్కడొక తలలేని నంది పడివుంది.
పద్మనాయక రాజు తవ్వించిందే చరిగొండలోని గౌరసముద్రం. రేచెర్ల పద్మనాయక రాజయిన రెండవ లింగమనీడు శాలివాహనశకము 1349, ప్లవంగనామ సంవత్సర, మార్గశిర పౌర్ణమినాడు అనగా క్రీ.శ. 1427 డిసెంబర్ 4వ తేదీన లింగమనీడు భార్య గౌరీదేవి పేరున ఈ చెరువు నిర్మాణము చేయించెనని చరిగొండ శాసనమువల్ల తెలుస్తున్నది. అంతేగాక ఆమె శ్రీశైల మల్లిఖార్జున స్వామికి, తిరుపతి వెంకటేశ్వరస్వామికి కానుకలు అర్పించిందట. భక్తులకు ధర్మసత్రాలను కట్టించినదట.
గౌరమ్మ చెరువు ఆవలి వొడ్డున పడమర దిక్కున ఒక దేవాలయమున్నది. వాటిని కృష్ణాపురము గుళ్ళు అంటారు
దుర్గమ్మగుడి ముందు నుంచి పొయ్యే గౌరమ్మచెరువు కాలువ గ్రామాన్ని రెండుగా చేసింది. కాలువకు దక్షిణాన చరికొండ పట్టి పడకలు, ఉత్తరాన చరికొండ పట్టి కల్వకుర్తి. వెనుకటి తూర్పుకోట, పడమటికోట అని ఇద్దరు మక్తేదార్ల నివాసాలు శిథిలస్థితిలో వున్నాయి.
కోనాపురం నుండి చరికొండకు వచ్చే తొవ్వలో రాకాసిగుళ్ళు, రాక్షసులబొందలు అని పిలువబడే మెగాలిథిక్ సమాధులున్నాయి.
చరిగొండ ధర్మన్న చిత్రభారత కావ్యం రాసిన కవి. చరిగొండవాడే. వరంగల్ నేలిన షితాబుఖానను సీతాపతి వద్ద మంత్రిగా పనిచేసిన ఎనమలూరి పెద్దనకు 8 ఆశ్వాసాల ప్రబంధ కావ్యాన్నంకితం చేసాడు చిత్రభారతకవి చరిగొండ ధర్మన్న. పెద్దన ధర్మపురికి చెందినవాడు. ధర్మన్న జీవితాకాలాన్ని ఆయన రచనలతో లెక్కించి క్రీ.శ. 1480 నుంచి 1530గా నిర్ణయించారు. ధర్మన్న ‘‘ శతలేఖిన్యవధాన పద్యరచనా సంధా సురత్రాణ చిహ్నితనామా, చరికొండ ధర్మసుకవీ’’ అని పిలువబడ్డాడు. చరిగొండ ధర్మన్న అవధానంలో ప్రవీణుడు. గంటకు వందపద్యాలు చెప్పగలవాడట.
మరొక ప్రతిభావంతుడైన కవి చరిగొండకే చెందిన హొన్నయ్య.ఈయన 17వ శతాబ్దంలో ‘జ్యోతిష్యరత్నాకరం’ రచించాడు. ప్రస్తుతమీ గ్రంథం లాస్ ఏంజెల్స్ గ్రంథాలయంలో వుందని ‘చరిగొండ చరిత్ర’ రాస్తున్న యారీదా రాధాకృష్ణా రావు గారు చెప్పారు.
రచనః శ్రీరామోజు హరగోపాల్,
కంటెంట్: వై.రాధాకృష్ణారావు, చరిగొండ














పరడలో బౌద్ధ నాగ ముచుళింద శిల్పం:
నిన్నటిరోజు 19.06.2018న తెలంగాణజాగృతి ఆధ్వర్యంలో చారిత్రకపరిశోధనలు చేస్తున్న చరిత్రబృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, రాగి మురళి, సూరారం రాంప్రసాద్, చంటిల సందర్శనలో పరడలో ‘‘నాగముచుళింద’’ విగ్రహం లభించింది. బుద్ధుడికి జ్ఞానోదయమైన పిదప తనను ప్రాకృతికతత్వాలనుంచి కాపాడింది నాగరూపియైన ముచుళిందుడు. బోధివృక్షం నీడలో తపస్సుచేస్తున్న బుద్ధుడికి జ్ఞానోదయం కలిగినపుడు 7రోజులపాటు స్వర్గాలు చీకటైపోయాయట. తెంపులేని వర్షం కురిసింది. నాగరాజైన ముచుళించుడు పాతాళం నుంచి వచ్చి తనపడగనీడలో బుద్ధుని కాపాడట. ముచుళింద సుత్తలో ఉరువేలాలోని నేరంజరా నది ఒడ్డున ముచులింద చెట్టు కింద బుద్ధునికి జ్ఞానోదయమైనట్టు చెప్పబడింది.
పరడ గ్రామం వెలుపల వున్న శివునిగుట్టకు ఉత్తరం అంచున మట్టిదిబ్బవుంది. అక్కడ సాతవాహనకాలంనాటి ఇటుకలతో కట్టిన వలయాకారపు కట్టడం కనిపిస్తున్నది. అది జారిపోకుండా రాళ్ళతో కట్టిన అంచు వుంది. అక్కడ నిధులవేటగాళ్ళు తవ్విపారేసిన గుంతలున్నాయి. చెట్లు పెరిగిపోయాయి. ఒక చెట్టు మొదట భద్రపరిచిన 8 అంగుళాలు ఎత్తు, 5 అంగుళాల వెడల్పున్న బలపపురాతిబిళ్ళ మీద చెక్కిన నాగముచుళింద శిల్పం కనిపించింది. దాదాపు సంవత్సరం కిందే బయటపడిందని గ్రామస్తులంటున్నారు. ఈ పూజావిగ్రహం అడుగున రెండువరుసలో 5,6 వ శతాబ్దాల తెలుగులిపిలో లఘుశాసనం వుంది. ‘‘స్వస్తిశ్రి మనుమథ సంసర’’ తప్ప మిగతా కొన్ని అక్షరాలు చదువడానికి అనువుగా స్పష్టంగా లేవు. నాగముచుళింద విగ్రహం లభించడం, వృత్తాకారపు ఇటుకల నిర్మాణం, డంగు సున్నం వాడిన ఆనవాళ్ళు ఇవి బౌద్ధస్తూపం వుండవచ్చన్న సందేహానికి తావిస్తున్నాయి. 
పరడలో గ్రామానికి వాయవ్యంగా వున్న చిన్నబోడగుట్టను శివునిగుట్ట అని పిలుస్తారు గ్రామస్తులు.దాని మీద ప్రాచీన శివాలయం వుంది. ఒక కోనేరు వుంది. ఈ గుట్ట మీద పురామానవుని ఆనవాళ్ళు అగుపిస్తున్నాయి. ఒక డోల్మన్, రాతిపరికరాల నూరుకున్న గుంతలు, వడిసెలరాళ్ళున్నాయి. రాతిగొడ్డండ్లు దొరికినాయని గ్రామస్తులు చెప్పారు. గుట్టచుట్టు వందల బంతిరాళ్ళ రాకాసిగుళ్ళుండేవట.పొలాలు చేయడం వల్ల అవన్నీ తొలగించబడ్డాయి. గ్రామానికి రెండువైపుల పాటిగడ్డలున్నాయి.పదులకొద్ది ఎకరాల్లో వున్న ఉత్తరపు పాటిగడ్డలో చరిత్రపూర్వయుగపు కుండపెంకులు, తొలిచారిత్రకకాలపు కుండపెంకులు విరివిగా లభిస్తున్నాయి. మట్టిపూసలలెన్నో దొరికినాయని అక్కడి రైతులు చెప్పారు. మాకు ఆ పొలాల్లో ఒక ‘లాపిస్ లాజులె’ (ఇంద్రనీలపురంగు) పూస దొరికింది. దీన్నిబట్టి ఈ ప్రదేశం చరిత్రపూర్వయుగపు కాలం నుంచి కొత్తరాతియుగం తొలిదశనుంచి ఇక్కడ మానవావాసాలున్నాయని, నాగరికతావికాసం జరిగిందని చెప్పవచ్చు.
తూర్పు పాటిగడ్డలో లభిస్తున్న కుండపెంకులు చారిత్రక మధ్యయుగాల నాటివి. అక్కడ పురాతన దాసాంజనేయుని ఆలయం వద్ద లభించిన దానశాసనం( నల్లగొండ శాసనసంపుటి, సంపుటం-1లో 129పేజిలోని శాసన సంఖ్య.48) క్రీ.శ. 1144లో కళ్యాణీ చాళుక్యచక్రవర్తి జగదేకమల్ల ప్రతాపచక్రవర్తి వేయించినది. శాసనంలో గ్రామం పేరు పరండ.
గొప్ప నాగరికతా సంస్కృతులకు నిలయమైన శివునిగుట్ట క్వారీపనులతో ధ్వంసమౌతున్నది. ప్రస్తుతం పుట్ట రాజిరెడ్డి, మందడి కొండలరెడ్డి, పుట్ట జైపాల్ రెడ్డి, లోకసాని రాంరెడ్డి మొదలైన గ్రామప్రజల వినతిమేరకు ఎండోమెంట్ నోటీసుతో తాత్కాలికంగా క్వారీపనులు ఆగినా ఇప్పటికే సగానికి ఎక్కువగా తొలిచేసిన గుట్ట పూర్తిగా నిర్మూలనం అవుతుందని గ్రామస్తులు భయపడుతున్నారు.






























చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...