యాదగిరిగుట్టలో ఆత్మాహుతిశిల:
యాదగిరిగుట్ట రాయగిరిల మధ్య రాయగిరి చెరువుకు ఉత్తరాన సాయిబాబా నగర్ ప్రాంతంలో రాష్ట్రకూటుల కాలంనాటి శిధిలశివాలయం ఆనవాళ్ళు లభించాయి. వాటికి తూర్పున 7 వీరశిలలు వున్నాయి. అందులో ఒక వీరగల్లు మీద 7,8 శతాబ్దాలనాటి తెలుగులిపిలో శాసనముంది. మహబూబ్నగర్ గొల్లత్తగుళ్ళ వద్ద కనిపించిన వీరగల్లుల మీద వున్న తెలుగులిపే ఇక్కడ అగుపించింది. అక్కడున్న వీరగల్లులు దాదాపు యుద్ధంలో ఒరిగిన వారివే. ఒక్కటి మాత్రం ప్రత్యేకం. ఈ వీరగల్లు రెండంతస్తులు కలిగివుంది. పై అంతస్తులో భక్తుడు అప్సరసల నడుమ కూర్చుని వున్నాడు. కింది అంతస్తులో ధ్యానాసనంలో నమస్కారముద్రలో కూర్చున్న భక్తుని మెడ తెగి తల వేరుగా కనిపిస్తున్నది. అతని పక్కన ఒంచిన (వెదురు)గడ తలమీద జుట్టును తాకుతున్నది. ఈ భక్తుని కోరిక మేరకు ఎవరో ఇతని మెడనరికి తలను వేరు చేసినట్లున్నది. ఇట్లా కోరి శివార్పణంగా తలపండునివ్వడం వీరశైవుల సంప్రదాయం. ఇటువంటి శిలలు పురుషులవి (1.బిర్లామ్యూజియం, హైద్రాబాద్,2. పెద్దపల్లి జిల్లా ఆబాది రామగుండం దగ్గర లింగాపురం, 3.యాదగిరిగుట్ట) దీనితో కలిపి3, స్త్రీలవి 3(జనగామజిల్లా వనపర్తి, యాదాద్రిజిల్లా చొల్లేరు, జనగామ జిల్లా సీతారాంపురం) ఆత్మాహుతి శిలలను తెలంగాణాలో తెలంగాణా జాగృతి చరిత్రబృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, చంటి, కళ్ళెం సంపత్ కుమార్ గౌడ్ గుర్తించారు
.