Tuesday, April 9, 2019

ఇంద్రపాలనగరంలో ‘శంకరగండరస’ జయధీర జైనబసది:

ఇంద్రపాలనగరంలో ‘శంకరగండరస’ జయధీర జైనబసది:

March 12, 2016న నేను, మా చంటితో కలిసి వలిగొండ, తుమ్మలగూడెం శంకరంగుట్టలలో చరిత్రకొరకు అన్వేషించాం. మాకు శంకరంగుట్ట మీది విశేషాలను చూడడానికి తోడ్పడ్డవారు వనంక్రిష్ణయ్య(భోగారం), వి.లింగయ్య (తుమ్మలగూడెం), బెలిదె రాజయ్య (నాగారం), యాదయ్య (తుమ్మలగూడెం).ఆ పెద్దలకు మా ధన్యవాదాలు.
ఈ గుట్టమీద కళ్యాణీ చాళుక్యులకాలం నాటి దేవాలయం, శాసనం శిథిలస్థితిలో వున్నాయి. పలుమార్లు పునరుద్ధరణలు చేయడం వల్ల దేవాలయం రూపురేఖలు చాలా మారి పోయాయి. జైనగుహాలయాలనే తమ ఇష్ట దైవాలయాలుగా మార్చివేసారు. ఇపుడు గుడివున్నచోటుకు పైకి వెళితే రాతిగుండ్ల మధ్యనుంచి తీసిన దారి జైనబసదికి తీసుకువెళ్తుంది. అక్కడ రెండు ఎత్తైన కొండరాళ్ళ మీద జైనతీర్థంకరుల ఉల్బణశిల్పాలు(Bas relieves) అగుపిస్తాయి.
తేదీలేని తుమ్మలగూడెం శాసనం(నల్లగొండ జిల్లా శాసనాల సంపుటి, వాల్యూం 1, పేజీనం.38 శా.సం.15)లో బిరుదగద్యలలో చెప్పబడిన శంకరగండరస ఎప్పటివాడో చెప్పలేదు. కాని, 2016 జనవరిలో నల్లగొండ జిల్లా ఆమనగల్లులో మాకు లభించిన శంకరగండరస శాసనం అకాలవర్షుని పరిపాలనాకాలం(క్రీ.శ.888)నాటిది. మహామండలేశ్వరుడుగా కొలనుపాక-20,000నాడును పాలిస్తున్న శంకరగండరస పేరన చేర్యాల దగ్గర ఆకునూరులో, వరంగల్ దగ్గర జాఫర్ గడ్ లో, తుమ్మలగూడెం(ఇంద్రపాలనగరం), ఆమనగల్లులో శాసనాలు లభించాయి. ఆమనగల్లులో తప్ప మిగతా శాసనాలలో శంకరగండరస కాలం లేదు. తర్వాత కాలంలో కొలనుపాకలోనే చిన్నా, పెద్దపాలకులుగా వున్న ఇద్దరు శంకరగండరసలున్నా వారి కాలం వేరు. వారి మతం వేరు. మొదటి శంకరగండరస కాలం క్రీ.శ. 888, రాష్ట్రకూటుల ప్రతినిధిగా కొలనుపాకను ఏలినవాడు. అమోఘవర్షుని కాలంలో పానుగనూరు-27000నాడుకు పాలకుడుగా వుండేవాడు. అమోఘవర్షునితో ఘర్షణ పడినా, దగ్గరి బంధువు, రాజకీయ చాతుర్యమున్నవాడు కనుక కొలనుపాకకు తిరిగి ప్రతినిధిగా నియమింపబడ్డాడు. రాష్ట్రకూటులు జైనులే. శంకరగండరస జైనుడే. ఆమనగల్లులో అతనిపేరన వేయబడిన శాసనంలో అక్కడ ‘ఆకులార్బుగుళు’ జైనబసదికి దానాలు చేసినట్టు వుంది. అతనికి వున్న బిరుదులలో ఒకటైన ‘జయధీర’ పేరన తుమ్మలగూడెంలో జయధీర జినాలయం కట్టించినట్టు చెప్పబడింది.
శంకరం గుట్ట మీదున్న ఈ జైనబసదే జయధీర జినాలయం. ఈ జైనబసదిలో రెండువైపుల రెండు నిలువు కొండరాళ్ళపై జైన తీర్థంకరుల బొమ్మలు ఒక వైపున పార్శ్వనాథునితో కూడిన 3తీర్థంకరులు, మరొకవైపు 5గురు తీర్థంకరులు ధ్యానాసనాలు, ధ్యానముద్రలతో వున్నారు. మరొక చోట అసంపూర్ణంగా వున్న శిల్పం కనబడుతున్నది. శంకరంగుట్ట అన్నది కూడా శంకరగండరస పేరుమీదనే వచ్చివుండవచ్చు.
(అయితే ఇదే గుట్టమీద తూర్పువైపున స్తూపాకారంలో ఇటుకల వరుసలు, 3చోట్ల కనిపిస్తున్నాయి. శంకరంగుట్టవెనకవైపు కింద మూసీనది ఒడ్డున బౌద్ధస్తూపం జాడలున్నాయి.)








No comments:

Post a Comment

చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...