Tuesday, August 4, 2020

కోటిలింగాలలో శాసనాలు

 

 

 

కోటిలింగాలలో శాసనాలు:

          కోటిలింగాలలో బౌద్ధస్తూపం శిథిలాలున్నచోట స్తూపానికి పెట్టే శిలాకంచుకానికి(Casing)వాడిన రాతిఫలకాలలో దొరికిన లేబుల్ శాసనాలు 26రింటిలో అర్థవంతమైన సమాచారం లేదని పురావస్తుశాఖ భావించింది. కాని ఠాకూర్ రాజారాం సింగ్ పట్టుదలతో ఆ శాసనాల ఫలకాలమీది రాతలను చూసి రాసుకొని,  తను చదువుకున్న పాఠశాలలోని మిత్రుని కుమారుడు మల్లావఝల నారాయణశర్మకు వాటి పరిష్కార బాధ్యతను అప్పగించాడు. ఐకే శర్మ సాయం కూడా లభించింది, నారాయణశర్మ ఆ శాసనాలను అధ్యయనం చేసి, బ్రాహ్మీలిపి పరిణామాలను పరీక్షించి, తాను వాటికి అర్థకల్పన చేసాడు. అవి బుద్ధుని ఆర్యసత్యాలను పోలివున్నాయని అభిప్రాయపడ్డాడు. లఘుశాసనాలలోని బ్రాహ్మీలిపి మౌర్యుల బ్రాహ్మీలిపితో, భట్టిప్రోలు బ్రాహ్మీతో పోలివుందని ఠాకూర్ రాజారాం సింగ్ అభిప్రాయపడ్డాడు. కొన్ని బ్రాహ్మీ అక్షరాలు పై లిపులకాలం కన్నా ముందరివని అభిప్రాయం కలిగింది. భాషాశాస్త్రవేత్త, సంస్కృత పండితుడు నారాయణశర్మ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. ‘కోటిలింగాల- బ్రాహ్మీలఘుశాసనాలు’ అనే పరిశోధనాపత్రం కరీంనగర్ నుంచి వచ్చిన సాతవాహన కళోత్సవాల సంచిక(2002)లో అచ్చయింది. ఈ పత్రాన్ని ‘కోటిలింగాల- ఏ రిపోర్ట్ ఆన్ ఎక్స్కేవేషన్స్(1979-1983)’లో శాసనాలు(10వ అధ్యాయం)లో ఎన్నెస్ రామచంద్రమూర్తి  పేర్కొన్నారు. ఈ కోటిలింగాల తవ్వకాల నివేదికలో కోటిలింగాలలో, పరిసరాలలో లభించిన శాసనాల గురించి కొంత వివరం లభిస్తున్నది.

          కోటిలింగాలలో దొరికిన కొన్ని లఘుశాసనాలలో ‘గరకస’, ‘ఘరినిధ(గృహిణి)’, ‘పొధమర’ లున్నాయి.

          మొక్కట్రావుపేటలో లభించిన ‘నాగగోపినికాయా’ నామశాసనం వున్నది.

          క్రీ.పూ.1వ శతాబ్దానికి చెందిన బ్రాహ్మీలిపిలో రాయబడిన ఈ నామశాసనంలోని ‘నికాయ’ ఒక మత సంబంధమైన శ్రేణి,  నాగగోప అనే వ్యక్తి ఆధ్వర్యంలోని బౌద్ధ సన్యాసుల సమూహం గురించి తెలుపుతుంది. నికాయకు ఒక రాశి, ఒక కూర్పు, వర్గం, ఒకే విధమైన విధులు నిర్వహించేవారి సంఘమని అర్థాలున్నాయి. బౌద్ధ సుత్త సాహిత్యంలో మజ్జిమ నికాయ, దీఘ నికాయ, అంగుత్త నికాయ, సంయుత్త నికాయ, ఖుద్దక నికాయలున్నాయి. ఈ నామక శాసన సందర్భాన్ని బట్టి బౌద్ధసన్యాసుల సంఘానికి పెద్దవాడు నాగగోప అని అర్థమవుతున్నది.

          కోటిలింగాలలో పెదవాగు ఒడ్డున బౌద్ధస్తూపముంది. కోటిలింగాలకు సమీపంలో పాశిగాం, కంభాలపల్లిలలో స్తూపాల, చైత్యాల శిథిలాలు లభించాయి.

          నాగగోపినికాయ నామశాసనం చెక్కిన రాతిదూలాన్ని చూసినపుడు, అది ఒక శ్రేణి, ఒక సంఘం వున్న స్థానానికి ప్రవేశద్వార పతంగం అనిపిస్తుంది. నిఘంటువులను సంప్రదిస్తే ఇల్లు, కులవృత్తుల సంఘం అని నికాయకు అర్థాలనిస్తున్నాయి.

          మొక్కట్రావుపేటలోనే లభించిన హకుసిరి శాసనంలో

          ‘అహమకా నభ(మ) బాలికాయ మహపురిస దతాయ

          అమచపుతస సివవటుస స ఉపథ యకినియ చదేయ

          చథ బాలికాయ హకుసిరియ ఈ దేయ నాగ(సిరి)య గోపియ’

 3వ పంక్తి చివర ‘నాగ...య గోపియ’ అని వుంది. అందువల్ల ‘నాగగోపినికాయ’ నామశాసనంలోని నాగగోపి ఇతడేనని చెప్పవచ్చు.




Thursday, April 23, 2020

పొట్లపల్లిలో శివాలయం:


 పొట్లపల్లిలో ఒకరు ఇంటిపనుల్లో భాగంగా తవ్వుతుంటే శివాలయంలో లింగం ప్రతిష్టించే పానవట్టం ఒకటి బయటపడ్డట్లు నిన్న వార్త వచ్చింది. హుస్నాబాద్ నుంచి విలేకరి మిత్రుడు ఎల్లయ్య రెండ్రోజుల నుంచి సంప్రదిస్తున్నాడు పొట్లపల్లి చరిత్ర గురించి. ఫేస్బుక్లో అనంతవరం శ్రీనివాస్ వార్త, ఫోటోలు పెడుతున్నాడు.
          ఇపుడు బయటపడ్డ పానవట్టం 5అంచుల గుండ్రని పానవట్టం. ఈ శైలి పానవట్టాలు కళ్యాణీ చాళుక్యులనాటి శివాలయాలలోనే ఎక్కువగా అగుపిస్తాయి. అయితే ఈ పానవట్టాల మీద ప్రతిష్టించే లింగాలు కాకతీయశైలి సమలింగాలు కావు. వీటికి బ్రహ్మ,విష్ణు,రుద్రభాగాలుండవు. ఒక లింగభాగమే వుంటుంది. నర్మదానదిలో దొరికే బాణలింగాలుగా పిలిచే గుండ్రని అండాకారపు రాళ్ళలో ఒకటి లింగంగా ఈ పానవట్టంమీద అమరుస్తారు. ఇపుడు పానవట్టం దొరికింది. అది  ఆలయం నుంచి తీసి బయటపడేసింది కాకపోతే బాణలింగం కూడా అక్కడే దొరకవచ్చు.
          కరీంనగర్ జిల్లా శాసనసంపుటిలో  16వ శాసనం(42వ పేజీ) పొట్లపల్లి శాసనం.ఈ శాసనంలో క్రీ.శ. 1066వ సం.(శక సం.988, చైత్రపౌర్ణిమ) మార్చి 14న, చంద్రగ్రహణం సందర్భంగా అక్కడి పంచమఠాలలోని నకరేశ్వర దేవరకు  తపోధనుడు మల్లప్ప(గురువు)అగ్రహారం కొరకు ద్రవ్యం మొదలైన సమభోగాలకు, త్రిభోగాభ్యంతర సిద్ధిగా, సర్వపరిహారం (అన్ని పన్నుల రద్దు)గా ధారాపూర్వకంగా 5 కొట్టరాడ్ల రాటణాన్ని కళ్యాణీ చాళుక్యచక్రవర్తి త్రైలోక్యమల్ల దేవుని పాలనాకాలంలో అతని మహాసామంతుడు పొట్టపల్లి గోవ(అధికారి) రేగొండ చందయ్య రసర్(రాజు) దానం చేసాడు.
          త్రైలోక్యమల్లదేవుని శాసనాలలో పంచమఠాల ప్రస్తావన వస్తుంది. ఈ పంచమఠాలు కాలాముఖమఠాలు కావచ్చు. పొట్లపల్లి  గురువు మల్లప్పకిచ్చిన అగ్రహారం. ఈ అగ్రహారంలో నీటి వ్యవస్థ కొరకు మహాసామంతుడు రేగొండ చందయ్యరసర్ నీరుతోడే యంత్రం రాటనాన్ని దానం చేసాడు. అగ్రహారానికి పన్నుల బాధలేకుండా చేసాడు.
          పొట్లపల్లి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలంలోని గ్రామం. ఈ గ్రామానికో వాగుంది. దాన్ని రేణుకావాగు అని పిలుస్తారు. ఊరిబయట నాగశిలలున్నాయి. పోషమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మదేవత, పరశురాముడికి గుడులున్నాయి. ఊరిలో మల్లన్న గుడి, సీతారామచంద్రస్వామి గుడి, శివాలయాలున్నాయి. అపుడపుడు గ్రామంలో పునాదుల కోసమో, పనులకోసమో తవ్వినపుడల్లా ఏదో ఒక విగ్రహమో, గుడి స్తంభాలో దొరుకుతుంటాయి.
          పొట్లపల్లి గ్రామానికి దగ్గరలో ఒకగుట్ట వుంది. దీన్ని ఎల్లమ్మగుట్ట అని పిలుస్తారు స్థానికులు. గుట్టపాదంలో  బంతిరాళ్ళ సమాధులు విరివిగా కనిపిస్తాయిక్కడ. వీటిని పరిశీలించినపుడు ఇవి పెదరాతియుగం సమాధులు అని తెలుస్తుంది.

చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...